భారతీయులు టిక్‌టాక్‌లో తెగ గడిపేశారు

3 Feb, 2020 19:38 IST|Sakshi

న్యూఢిల్లీటిక్‌టాక్‌ యాప్‌ను భారతీయులు అధికంగా  వినియోగిస్తున్నారు. రోజురోజుకు టిక్‌టాక్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. యూజర్లు తమ వీడియోల ద్వారా ప్రతిభను బయటపెడుతున్నారు. అదేవిధంగా చాలా మంది ఈ టిక్‌టాక్‌ వీడియోల్లో డాన్స్‌లు, పాటలు, చాలెంజ్‌లు చేస్తూ.. సోషల్‌మీడియాలో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. సాధారణంగా ఈ టిక్‌టాక్‌  వీడియోలను చూస్తూ.. వైరల్‌గా మారిన వీడియోలను షేర్‌ చేస్తూ యూజర్లు గంటల కొద్ది సమయాన్ని గడిపేస్తున్నారు. కొంతమందికి తమ ప్రతిభను బయట పెట్టడానికి.. మరికొంతమందికి కాలక్షేపం, వినోదానికి అనువుగా ఉండటంలో ఈ యాప్‌పై యూజర్లు బోలడంత సమయాన్ని కేటాయిస్తున్నారు.

తాజగా ఈ టిక్‌టాక్‌ యాప్‌పై యూజర్లు ఖర్చు చేస్తున్న సమయాన్ని తెలిపే ఓ నివేదికను అమెరికాకు చెందిన ‘యాప్ అన్నీ’ అనే డేటా అనలిటిక్స్ సంస్థ  విడుదల చేసింది. ఈ నివేదిక చాలా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. 2019లో టిక్‌టాక్‌ వీడియో షేరింగ్ యాప్‌పై భారతీయ యూజర్లు 550 కోట్ల గంటల సమయాన్ని ఖర్చు చేశారని ఆ నివేదిక పేర్కొంది. టిక్‌టాక్‌ యాప్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు 2018 కంటే 2019లో ఎక్కువ సమయాన్ని గడిపారని తెలిపింది.

కాగా, 2019 నాటికి ఈ యాప్‌ను యాక్టివ్‌గా ఉపయోగించే వారి సంఖ్య 90 శాతం పెరిగిందని వెల్లడించింది. ఈ టిక్‌టాక్‌ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న యాక్టివ్‌ యూజర్లలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఈ టిక్‌టాక్‌ యాప్‌ను 2019లో 74 కోట్లమంది తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 2018తో పోల్చితే 13 శాతం ఎక్కువగా 2019లో యూజర్లు ఈ టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్లు ఆ నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు