కులాంతరంవైపే యువతరం

22 Jul, 2018 01:39 IST|Sakshi

పెళ్ళి తరువాత ఇంటిపేరు మార్పు అవసరంలేదన్న యువత 

భారతీయ యువతరంలో టెక్నాలజీ చైతన్యం నింపుతోందా? ఇందుకు అవుననే సమాధానమిస్తోంది ఢిల్లీ కేంద్రంగా ‘‘పల్స్‌ ఆఫ్‌ ద నేషన్‌’’పేరుతో జరిగిన తాజా అధ్యయనం. ఇన్‌షార్ట్స్‌ అనే న్యూస్‌ యాప్‌ ద్వారా జరిపిన ఈ సర్వేలో 18 నుంచి 35 ఏళ్లలోపు 1,30,000 మంది పాల్గొంటే అందులో 70 శాతం మంది కులాంతర వివాహాలకు సుముఖంగా ఉన్నట్టు తేలింది. అలాగే పెళ్లయ్యాక మహిళలు తమ ఇంటిపేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని కూడా 70 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు.

పెళ్లి ఖర్చులు వధువు తరఫు వారే భరించాలన్న సనాతన భావజాలానికి భిన్నంగా సర్వేలో పాల్గొన్న పురుషులు స్పందించారు. వారిలో 90 శాతం మంది పెళ్లి ఖర్చులను పంచుకుంటామని చెప్పడం భారతీయ యువతరంలో చైతన్యానికి ఉదాహరణగా సర్వే సంస్థ అభిప్రాయపడింది. దాదాపు 84 శాతం మంది మహిళలు తమ భర్తలు తమకన్నా తక్కువ ఆదాయం ఉన్నా అదేం పట్టించుకోబోమని పేర్కొన్నారు. 7 శాతం మంది పురుషులు మాత్రం తమకన్నా తమ భార్యలకు ఎక్కువ ఆదాయం ఉండటం అభ్యంతరకరమన్నారు. 

పెళ్లిళ్లు, ఒకే కులం వారిని వివాహం చేసుకోవడం, భార్యలు నిర్వహించాల్సిన పాత్రలు, ఆస్తి హక్కు వంటి విషయాలపై భారతీయుల్లో కనిపించే సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా యువతరం స్పందించడం గమనార్హం.

మరిన్ని వార్తలు