భారత్‌లో తొలి పాడ్‌ హోటల్‌ ఇదే!

7 Apr, 2017 17:13 IST|Sakshi
భారత్‌లో తొలి పాడ్‌ హోటల్‌ ఇదే!
ముంబై: అంతరిక్ష సినిమాలు ప్యాసెంజర్, ఇంటర్‌స్టెల్లార్‌ చూసిన వాళ్లకు పాడ్స్‌ (పడక గదులు) ఎంత చిన్నగా, చూడముచ్చటగా ఉంటాయో తెల్సిందే. ఒక్కసారైనా అలాంటి పడక గదుల్లో నిద్రించి కలల ప్రపంచంలో తేలిపోవాలనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లకే కాదు, అవసరానికి ఖరీదైనా హోటల్‌ గదుల్లో బసచేసే స్థోమత అంతగా లేనివారు కూడా అలాండి పాడ్స్‌లో పడుకునేందుకు భారత్‌లో వీలవుతుంది.. దేశంలోనే మొట్టమొదటి పాడ్స్‌ హోటల్‌ ముంబైలో కొలువుతీరింది. 
 
అసలే స్థలాభావం ఎక్కువగా ఉండే ముంబైలో, అందులోనూ అత్యంత ఖరీదైన అంధేరి ప్రాంతంలో బస్‌ డిపో పక్కన 140 పాడ్స్‌ హోటల్‌ను నిర్మించారు. శలాబ్‌ మిట్టల్, హిరేన్‌ గాంధీ పారిశ్రామిక వేత్తలు కలసి అర్బన్‌ పాడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఈ హోటల్‌ను నిర్మించారు. ఇందులో 50 నుంచి 90 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పడక గదుల్లో శాటిలైట్‌ టెలివిజన్, ఉచిత వైఫై, విలువైన వస్తువులను దాచుకునేందుకు పర్సనల్‌ లాకర్, పడుకునేందుకు, చదువుకునేందుకు అడ్జస్టబుల్‌ లైట్లు, ప్రైవసీ కోసం డోర్‌ లాక్‌ సిస్టమ్‌లు ఉన్నాయి. అనుబంధంగా బాత్‌రూమ్‌లు, 60 సీట్ల కామన్‌ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ముంబై లాంటి ఖరీదైన నగరంలో ఇన్ని సౌకర్యాలున్న గదులను రోజుకు రెండు వేల నుంచి రెండున్నర వేల రూపాయలకు ఇస్తున్నారు. బుధవారమే ప్రారంభమైన ఈ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ ఉచితం. 
 
ప్రపంచంలోనే తొలి పాడ్స్‌ హోటల్‌ జపాన్‌లోని ఒసాకా నగరంలో 1979లో ఏర్పాటైంది. అక్కడ క్యాప్సుల్స్‌ అని పిలిచే ఈ హోటల్‌ గదులను కిషో కురోకవా అనే ఆర్టిటెక్ట్‌ డిజైన్‌ చేశారు. ఇప్పడు ఇలాంటి పాడ్స్‌ హోటళ్లు రష్యా, అమెరికా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, సింగపూర్, మలేషియా నగరాలకు విస్తరించాయి. భారత్‌లో మాత్రం ఇదే తొలి పాడ్స్‌ హోటల్‌. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలాంటి హోటళ్లకు అనువైనవి. తక్కువ ఖర్చుతో ఖరీదైన సౌకర్యం పొందాలనుకున్నవారికి, ఒంటరిగా ప్రయాణించే వారికి ఓ పాడ్స్‌ హోటళ్లు ఎంతో సౌకర్యవంతమైనవి. 
 
మరిన్ని వార్తలు