అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. హాజరైన ప్రముఖులు

21 Jun, 2019 09:14 IST|Sakshi

న్యూఢిల్లీ : అయిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, ప్రముఖులు వేడుకలు నిర్వహించారు. ఆసనాలు వేశారు.

రాష్ట్రపతి భవన్‌..
రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా యోగా దినోత్సవాన్ని జరపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ యోగాను ఒక వేడుకలా భావించకుండా ప్రతి రోజు సాధన చేయాలి. మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని’ ఆయన కోరారు.

మోదీ కోసం యోగా కాదు : వెంకయ్య
యోగా అనేది మోదీ కోసం కాదు మన శరీరం కోసం అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాలు రెడీ టూ ఈట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అలాంటి ఆహారం వల్ల మన శరీరానికి హానీ జరుగుతుందని పేర్కొన్నారు. మన పూర్వికులు మనకు మంచి ఆహారపు అలవాట్లను ఇచ్చారన్నారు. పిజ్జా, బర్గర్‌లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు వెంకయ్య.

పార్లమెంట్‌లో...
పార్లమెంట్‌ ప్రాంగణంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్లమెంట్‌ సభ్యులతో పాటు సిబ్బంది కూడా హాజరయ్యారు.

18 వేల అడుగుల ఎత్తులో యోగా
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండో టిబెట్‌ బార్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) సిబ్బంది ఉత్తర లడఖ్‌లో మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 18000 అడుగుల ఎత్తులో యోగా చేశారు.

ఐక్యరాజ్య సమితిది ప్రత్యేక స్థానం : సయ్యద్‌ అక్బరుద్దీన్‌
ప్రపంచవ్యాప్తంగా యోగా వ్యాప్తి చెందడంలో ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక స్థానం ఉందన్నారు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌. ఐక్యరాజ్య సమితి కృషి ఫలితంగానే భారతదేశానికి చెందిన అతి పురాతన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రధాన ఆచారంగా మారిందన్నారు.

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ మీద..
ముంబైలోని వెస్ట్రన్‌ నావల్‌ డాక్‌యార్డ్‌ ఐఎన్‌ఎస్‌ విరాట్‌ బోర్డు మీద అంతర్జాతీ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. సిబ్బంది పాల్గొని ఆసనాలు వేశారు.

ఢిల్లీలో...
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ బిజ్వాసన్‌ ప్రజలతో కలిసి ఆసనాలు వేశారు.

ముంబై..
బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ హాజరయ్యి రాందేవ్‌తో కలిసి యోగా ఆసనాలు వేశారు. సినీ నటి శిల్పా శెట్టి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద జనాలతో కలిసి యోగా ఆసనాలు వేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు