ఎక్కడ చూసినా ఆయన భార్య ఫోటోలే!

4 Mar, 2016 09:16 IST|Sakshi
ఎక్కడ చూసినా ఆయన భార్య ఫోటోలే!

బెంగళూరు: ఓ ఫోటోగ్రాఫర్కు అనుకోని అరుదైన గౌరవం దక్కింది. దీపావళి రోజు అతను సరదాగా సెల్ ఫోన్ లో తీసిన తన భార్య ఫోటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ హోర్డింగ్లలో కనిపిస్తోంది. సెలబ్రిటీల ఫోటోల మాదిరిగా పెద్ద నగరాల్లో ఎక్కడచూసినా తన భార్య ఫోటో.. అదీ తను కళాత్మకంగా తీసిన ఆ ఫోటో కనిపిస్తుండటంతో ఫోటోగ్రాఫర్గానే కాదు భర్తగానూ మురిసిపోతున్నాడు అతడు.

బెంగళూరుకు చెందిన ఆశిష్ పర్మార్ వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్. దీపావళీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా ఆశిష్ తన భార్య రైనా నన్నయ్య ఫోటోను ఐఫోన్ 6ఎస్ కెమెరాలో బంధించాడు. చేతుల్లో దీపాన్ని పట్టుకొని, ఆ దీపపు వెలుగులు ఆమె ముఖంపై పడుతున్నట్లుగా కనిపిస్తున్న రైనా నన్నయ్య ఫోటోను ఇప్పుడు యాపిల్ సంస్థ తన ప్రచార కార్యక్రమానికి ఉపయోగిస్తోంది. యాపిల్ సంస్థ నిర్వహించిన 'షాట్ ఆన్ ఐఫోన్ 6ఎస్' ప్రచార కార్యక్రమానికి ఐ ఫోన్తో తీసిన ప్రపంచంలోని ఉత్తమ ఫోటోలను ఎంపిక చేశారు. దీనిలో మొత్తం 53 ఉత్తమ ఫోటోలను ఎంపిక చేయగా అందులో ఆశిష్ తీసిన ఫోటో ఎంపికైంది. దీంతో యాపిల్ సంస్థ తన పలు ముఖ్యనగరాల్లో రైనా ఫోటోలను తమ ప్రచార కార్యక్రమం కోసం వాడుకుంటోంది. నగరంలో అక్కడక్కడ తళుక్కుమంటున్న ఆ ఫోటోలను చూసిన ఆ దంపతులు సంతోషంలో మునిగితేలుతున్నారు.

దీనిపై ఆశిష్ మాట్లాడుతూ.. 'ద షాట్ ఆన్ ఐఫోన్ 6ఎస్' ప్రచార కార్యక్రమం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. అందరూ ఫోన్ చేస్తుండటంతో ఉదయం నుండి నా ఫోన్ మోగుతూనే ఉంది. మీడియా వారు ఇంటర్వ్యూల కోసం సంప్రదిస్తున్నారు. యాపిల్ ప్రచారకార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినందుకు ఫోటో గ్రాఫర్గానే కాదు భర్తగానూ సంతోషంగా ఉంది' అని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు