తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌లో జాప్యం : పరిహారం చెల్లింపు

23 Jan, 2020 08:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌-ముంబై తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం మధ్యాహ్నం గంట ఆలస్యం కావడంతో ప్రయాణీకులకు రూ 63,000 పరిహారం చెల్లించనున్నట్టు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. దేశంలో రెండో ప్రైవేట్‌ ట్రైన్‌గా అహ్మదాబాద్‌-ముంబై ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 19 నుంచి ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ఈ రైలు గంటా 30 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్ధానానికి చేరుకుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. తమ రిఫండ్‌ పాలసీకి అనుగుణంగా రైలులో జాప్యం జరిగినందున ప్రయాణీకులు దరఖాస్తు చేసు​కోవచ్చని, వెరిఫికేషన్‌ అనంతరం వారికి రిఫండ్‌ చేస్తామని ఐఆర్‌సీటీసీ ప్రతినిధి పేర్కొన్నారు.

తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ అహ్మదాబాద్‌లో ఉదయం 6.42కు బయలుదేరి ముంబై సెంట్రల్‌కు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకోవాల్సి ఉండగా 2.36 గంటలకు గమ్యాస్ధానానికి చేరుకుంది. ముంబై శివార్లలోని భయందర్‌, దహిసర్‌ స్టేషన్ల మధ్య రైలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంతో జాప్యం నెలకొంది. సాంకేతిక సమస్యలు సర్దుబాటు అయిన తర్వాత రైలు ముంబైకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఐఆర్‌సీటీసీ పాలిసీ ప్రకారం రైలు గంట ఆలస్యమైతే రూ 100, రెండు గంటలు జాప్యం జరిగితే రూ 250 చెల్లిస్తారు.

చదవండి : ట్రైన్‌ హోస్టెస్‌ల ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు..

>
మరిన్ని వార్తలు