ఇంపాల్: ఎట్టకేలకు తన పదహారేళ్ల అకుంటిత దీక్షకు మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల ముగింపుపలుకుతున్నారు. మంగళవారం ఉదయం ఆమె తన దీక్షను విరమించేందుకు సర్వం సిద్థం చేసుకున్నారు. ప్రముఖ హక్కుల కార్యకర్త అయిన ఇరోమ్ షర్మిల నాజల్ ట్యూబ్ ద్వారా మాత్రమే ద్రవ పదార్థం ఆహారంగా తీసుకుంటూ వచ్చారు.
మణిపూర్ లో అమలుచేస్తున్న ప్రత్యేక సాయుధ బలగాల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో ఆమె 2000 సంవత్సరం నుంచి ఈ దీక్షను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె పోలీసుల అదుపులోనే ఓ ఆస్పత్రిలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆమెను జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె తన దీక్షను విరమించినట్లు ప్రకటించగానే కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగిసినట్లుగా ప్రకటించనుంది. అనంతరం ఆమె తన మద్దతుదారులతో సమావేశం కానున్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే వార్తా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.