ఐఎస్‌, ఉగ్రవాదులను పొగుడుతూ రాతలు

5 Jun, 2019 10:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ను పొగుడుతూ బ్రిడ్జ్‌ పిల్లర్‌పై గుర్తు తెలియని దుండగులు రాతలు రాయడం కలకలం రేపింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ విచారణ చేపట్టింది. వివరాలు.. ముంబై అర్బన్‌లోని బ్రిడ్జి పిల్లర్లపై ఐఎస్‌ హెడ్‌ అబూ బాకర్‌ అల్‌ బాగ్దాదీ, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను పొగుడుతూ రాతలు వెలిశాయి. ప్రపంచాన్ని వణికించే ఉగ్రవాది బాగ్దాది అంటూ ఐఎస్‌ను చీఫ్‌ను పొగడటంతో పాటు.. పోర్టు, ఎయిర్‌పోర్టు, పైప్‌లైన్‌, ట్రెయిన్‌ వంటి వివిధ చిత్రాలను గీసిన దుండగులు వాటిని మార్క్‌ చేశారు. ఈ విషయాన్ని గమనించిన కోప్తా గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చారు.

ఈ నేపథ్యంలో బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఏటీఎస్‌కు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అర్బన్‌ ఏరియా, పోర్టు సమీపంలో భద్రత పటిష్టం చేశారు. బుధవారం రంజాన్‌ నేపథ్యంలో అల్లర్లు ప్రేరేపించేందుకే దుండగులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే బ్రిడ్జికి సమీపంలో మద్యం సీసాలు లభించిన కారణంగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే ఆకతాయిలు ఈ పని చేశారా అన్న దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు