రోహింగ్యాలకు ఐఎస్‌ఐఎస్‌ శిక్షణ

13 Oct, 2017 19:04 IST|Sakshi

నాగాలాండ్‌పై దాడి జరిగే అవకాశం

2 వేల మందికి మిలటరీ శిక్షణ

ఆత్మాహుతి దాడికి యువతను సిద్ధం చేసిన వైనం

శరణార్థి శిబిరాల్లో ఉగ్రవాద సంస్థలు

రోహింగ్యాలు ఆయుధాలు అందిస్తున్న ఉగ్రవాదులు

కేంద్రానికి తెలిపిన నాగాలాండ్‌ నిఘావర్గాలు

కోహిమా : రోహింగ్యా అక్రమ వలసదారులతో దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశముందని నాగాలాండ్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో కేంద్రానికి తెలిపింది. ఇప్పటికే దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలకు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రోహింగ్యాలకు ఆయుధాలు అందించేలా బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలతో దిమాపూర్‌ ఇమామ్‌ చర్చలు జరిపినట్లు నాగాలాండ్‌ నిఘా వర్గాలు తెలిపాయి.

సుమారు 2 వేల మంది రోహింగ్యాలకు రహస్య ప్రదేశంలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. బలమైన ఆయుధాలతో కూడిన  రోహింగ్యాలు ఏ క్షణంలో అయినా నాగాలాండ్‌ మీద విరుచుకుపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్రానికి తెలిపాయి. ముఖ్యంగా నాగాలాండ్‌లోని హెబ్రాన్‌, ఖేచి క్యాంప్‌లపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశముందని నాగాలాండ్‌ నిఘా వర్గాలు తెలిపాయి.

సరిహద్దులకు ఆవల ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరాలకు చేరుకున్న ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులు.. యువతకు మిలటరీ శిక్షణ ఇస్తున్నారని బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) వీకే గౌర్‌ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద  జమాత్‌ఘుద్‌ దవా, జమాత్‌ ఈ ఇస్లామీ, ఆల్‌ఖైదా, ఐఎస్‌ఐ వంటి సంస్థలు కూడా రోహింగ్య శరణార్థి శిబిరాల్లో ప్రవేశించాయని ఆయన తెలిపారు. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు