సీఎం మేనల్లుడి ఆస్తులు అటాచ్‌

30 Jul, 2019 14:16 IST|Sakshi

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరి, ఆయన కంపెనీలకు చెందిన రూ 254 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయ పన్ను శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్‌ యూనిట్‌ అటాచ్‌ చేసింది. అటాచ్‌ చేసిన ఆస్తుల్లో ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయని ఐటీ అధికారులు పేర్కొన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజేష్‌ సక్సేనా ద్వారా ఎఫ్‌డీఐల రూపంలో అక్రమ నగదును దేశానికి తీసుకువచ్చారని వెల్లడించారు.

అగస్టా వెస్ట్‌లాండ్‌ ఒప్పందంలో సమకూరిన లంచాల సొమ్మును దారిమళ్లించడంలో రతుల్‌ పూరి పాత్రపై ఐటీ, ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా తాను రాజకీయ నేత బంధువనే కారణంతో ఈడీ తనను వేధిస్తోందని ఆరోపిస్తూ రతుల్‌ పూరీ ఈనెల 27న ముందస్తు బెయిల్‌ దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు రతుల్‌ పూరి దర్యాప్తునకు సహకరించడం లేదని, వాస్తవాలు వెల్లడించడం లేదని ఈడీ వాదిస్తోంది. పూరి బెయిల్‌ దరఖాస్తును ప్రస్తుతం ఢిల్లీ కోర్టు విచారిస్తోంది.

మరిన్ని వార్తలు