చిదంబరం కుటుంబంపై ఐటీ చార్జిషీటు

12 May, 2018 04:14 IST|Sakshi

చెన్నై: విదేశాల్లోని ఆస్తుల వివరాలు వెల్లడించలేదన్న ఆరోపణలతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత చిదంబరం భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) చార్జిషీట్లు దాఖలు చేసింది. చెన్నైలోని ప్రత్యేక కోర్టు ముందు ఈ చార్జిషీట్లను దాఖలు చేసింది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న రూ.5.37 కోట్ల విలువైన ఆస్తి, రూ.80 లక్షల విలువైన మరో ఆస్తి, అమెరికాలోని రూ.3.28 కోట్ల విలువైన ఆస్తి వివరాలను నళిని, కార్తీ, శ్రీనిధి వెల్లడించలేదని ఐటీ శాఖ పేర్కొంది.

కార్తీ సహ యజమానిగా ఉన్న చెస్‌ గ్లోబల్‌ అడ్వైజరీ సంస్థ, చిదంబరం కుటుంబం ఈ వివరాల్ని దాచడం నల్లధన నిరోధక చట్టాన్ని అతిక్రమించినట్లేనని తెలిపింది. ఈ కేసులో కార్తీకి, ఆయన కుటుంబానికి గతంలో నోటీసులు జారీచేసింది. ఆ నోటీసులను సవాల్‌ చేస్తూ మద్రాస్‌ హైకోర్టులో కార్తీ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. కాగా, ఈ కేసులో విచారణ దాదాపు చివరి దశకు చేరుకుందని, అందుకే కోర్టు ముందు చార్జిషీటు దాఖలు చేసినట్లు ఐటీ శాఖ అధికారులు చెప్పారు. నల్లధన చట్టం ప్రకారం వెల్లడించని విదేశీ ఆస్తులపై 120 శాతం పన్ను విధించడమే కాకుండా దాదాపు పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

మరిన్ని వార్తలు