‘జైషే క్యాంపులపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిజమే’

3 Mar, 2019 11:42 IST|Sakshi

మాపై మెరుపు దాడులు నిజమే.. జైషే చీఫ్‌ 

న్యూఢిల్లీ : భారత సర్జికల్‌ దాడులతో ఎలాంటి నష్టం జరుగలేదని పాకిస్తాన్‌ చెప్తున్న మాటలు తప్పని రుజువయ్యాయి. తమపై ఐఏఎఫ్‌ మెరుపుదాడులు చేసింది నిజమేనని జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ తమ్ముడు మౌలానా అమర్‌ వెల్లడించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన మరుసటి రోజున జైషే సీనియర్లతో జరిగిన సమావేశంలో అమర్‌ మాట్లాడినట్టు ఓ ఆడియో షోషల్‌ మీడియా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ‘బాలాకోట్‌లోని జైషే క్యాంపులపై వైమానిక దాడులు జరిగింది నిజమే. అయితే, మార్కజ్‌ (జిహాద్‌ బోధనా కేంద్రం)పై మాత్రమే దాడులు జరిగాయి. భారత్‌ చెప్తున్నట్టు జైషే కీలక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు. మా భూభాగంలోకి వచ్చి మరీ జిహాద్‌ బోధనా కేంద్రంపై భారత్‌ దాడులకు దిగడం తీవ్ర వేదనకు గురిచేసింది. దీంతో ప్రతీకారానికి భారత్‌ మంచి అవకాశం ఇచ్చింది. మాపై దాడి చేసి యుద్ధానికి కాలు దువ్వింది’ అని వ్యాఖ్యానించాడు. (మసూద్‌కు సైనిక ఆస్పత్రిలో చికిత్స)

భారీ స్థాయిలో మృతులు..
కశ్మీర్‌ను రక్షించుకునేందుకు జిహాద్‌ శిక్షణ పొందుతున్న వారిపై ఐఏఎఫ్‌ బాంబులతో విరుచుకుపడిందని అమర్‌ తెలిపారు. తద్వారా కశ్మీర్‌లోని ముస్లింలకు భారత్‌ మరింత కోపం తెప్పించిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మిరాజ్‌ జెట్‌ ఫైటర్స్‌ దాడుల్లో ‘జబా టాప్‌’ అనే కొండ ప్రాంతంలో చాలా మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి. అక్కడ పడి ఉన్న దాదాపు 30 శవాలను తరలించేందుకు అంబులెన్సులు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. ఉగ్రవాద శిక్షణనిస్తున్న మాజీ ఐఎస్‌ఐ అధికారి, కల్నల్‌  సలీం కూడా ఈ దాడుల్లో మరణించినట్టు సమాచారం. (సరిహద్దుకు అటూ.. ఇటూ..)

మరిన్ని వార్తలు