అరెరె.. కేంద్ర మంత్రి కాన్వాయ్ ఎక్కడ?

26 Sep, 2015 18:23 IST|Sakshi
అరెరె.. కేంద్ర మంత్రి కాన్వాయ్ ఎక్కడ?

కోల్కతా : కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కాన్వాయ్ కొద్దిసేపు కనిపించకపోవటంతో అధికారులకు కొద్దిసేపు ముచ్చెమటలు పట్టాయి. వివరాల్లోకి వెళితే... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నివాసానికి శనివారం అరుణ్ జైట్లీ బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ మిగతా వాహనాల నుంచి వేరయింది. కేంద్రమంత్రి సెక్యూరిటీ అధికారులు, కోల్ కతా పోలీసుల మధ్య సమాచారలోపం తలెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గుర్తించారు. అయితే  జైట్లీ కారు రాజ్ భవన్కు చేరుకుందని సమాచారం అందుకున్న అధికారులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు.

ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవలే మరణించిన క్రికెట్ దార్శనికుడు జగ్మోహన్ దాల్మియా కుటుంబసభ్యులను పరామర్శించడానికి కోల్ కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జైట్లీ కాన్వాయ్ వాహనాలతో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కాన్వాయ్ అన్ని వాహనాలు ముందుగా సూచించిన దారిలో వెళ్తుండగా, మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ఏజేసీ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర దారి మళ్లింది. అక్కడి నుంచి ఆ కాన్వాయ్ నేరుగా రాజ్ భవన్ చేరుకుంది.

అనంతరం దాల్మియా నివాసానికి షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా జైట్లీ ఉన్న కారు చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. మంత్రి కాన్వాయ్ కి ఉన్న జామర్ కారణంగా కొన్నిసార్లు సమాచారలోపం తలెత్తి ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు