అమిత్‌ షాతో కశ్మీర్‌ పంచాయతీ ప్రతినిధుల భేటీ

3 Sep, 2019 14:12 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ పంచాయతీ అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో గత నెలరోజులుగా కశ్మీర్‌ లోయ నిషేధాజ్ఞల నీడలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు గ్రామపంచాయతీల పెద్దలతో కూడిన ప్రతినిధుల బృందం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో షాతో సమావేశమైంది. ఈ సమావేశంలో హోంశాఖ అధికారులతోపాటు, కశ్మీర్‌ డివిజినల్‌ కమిషనర్‌, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పూల్వామా, కశ్మీర్‌, జమ్మూ, లధాక్‌ ప్రాంతాల ప్రజలు కూడా ఈ బృందంలో ప్రతినిధులుగా ఉన్నారు. అభివృద్ధి నిధులు జమ్మూకశ్మీర్‌లోని గ్రామ​ పంచాయతీలకు నేరుగా అందించడం, ఆ నిధులతో గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం, గ్రామాభివృద్ధిలో పంచాతీయ పెద్దలను ప్రత్యక్ష భాగస్వాములను చేయడం తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు