కశ్మీర్‌ ప్రగతి ప్రస్థానం షురూ

4 Oct, 2019 04:26 IST|Sakshi

‘వందేభారత్‌’ రైలు ప్రారంభోత్సవంలో హోం మంత్రి అమిత్‌ షా

పలు ప్రత్యేకతలతో ఢిల్లీ–కత్రా ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 కారణంగా ఇప్పటి వరకు నిలిచిన కశ్మీర్‌ అభివృద్ధి ప్రస్థానం, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి మొదలయిందని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. గురువారం ఆయన రైల్వే మంత్రి గోయెల్‌తో కలిసి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఢిల్లీ–కత్రా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 రద్దు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారం భంతో నవ భారతం, నవ జమ్మూకశ్మీ ర్‌కు కొత్త చరిత్ర సృష్టించ నున్నాయ న్నారు.

‘ఆర్టికల్‌ 370 దేశ ఐక్యతకు అవరోధంగా నిలవడమే కాదు, కశ్మీర్‌ అభివృద్ధికి అతిపెద్ద అడ్డుగా మారిందని నా అభిప్రాయం. ఈ ఆర్టికల్‌ రద్దు తర్వాత ఉగ్రవా దాన్ని, ఉగ్ర భావజాలాన్ని పూర్తిగా రూపుమా పుతాం’ అని అమిత్‌ షా ప్రకటించారు. ‘వచ్చే 10 ఏళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ మారనుంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో ఈ ప్రగతి ప్రస్థానం ప్రారంభమైంది. ఈ రైలు ద్వారా అభివృద్ధికి,, ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం లభించనుంది’ అని ప్రకటించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రాకతో ఢిల్లీ–కత్రా ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గనుందన్నారు.


వైష్ణోదేవి భక్తులకు బహుమతి: ప్రధాని
‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ వైష్ణోదేవి భక్తులకు నవరాత్రి కానుక అని మోదీ అన్నారు. గురువారం ఆయన ట్విట్టర్‌లో..‘జమ్మూలోని నా సోదరసోదరీమణులకు, వైష్ణోదేవి మాత భక్తులకు నవరాత్రి కానుక. కొత్తగా ప్రారంభించిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో న్యూఢిల్లీ నుంచి వైష్ణోదేవి ఆలయం ఉన్న కత్రాకు అనుసంధానత, ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి కానుంది’ అని పేర్కొన్నారు.

వందేభారత్‌ విశేషాలు..
► ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం
► మంగళవారం మినహా అన్ని రోజులు
► ప్రయాణ వేగం గంటకు 130 కి.మీ.లు
► ఎయిర్‌ కండిషన్డు కోచ్‌లు 16
► ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లు 2
► కోచ్‌లను కలిపే సెన్సార్‌ డోర్లు
► కోచ్‌ మొత్తాన్ని పొడవుగా కలుపుతూ ఒకే మందపాటి కిటికీ
► సూర్య కిరణాలు సోకని, రాళ్లు రువ్వినా పగలని కిటికీలు.
► పశువులు అడ్డుగా వచ్చినా రైలుకు నష్టం కలగని, పట్టాలు తప్పకుండా ఇంజిన్‌ ముందుభాగంలో పటిష్టమైన అల్యూమినియంతో రక్షణ.
► ప్రతి కోచ్‌లోనూ సీసీటీవీ కెమెరాలు.
► ఫేసియల్‌ టెక్నాలజీ ద్వారా వ్యక్తుల అనుమానాస్పద కదలికలను గుర్తించేæ సాంకేతికత.
► కోచ్‌ల్లో రివాల్వింగ్‌ సీట్లు, కొత్త రకం వాష్‌ బేసిన్లు, ఆటోమేటిక్‌ డోర్లు, వైఫై.
► ప్రయాణికులు వదిలేసిన లగేజీని గుర్తించే టెక్నాలజీ
► డీప్‌ ఫ్రీజర్‌తో కూడిన విశాలమైన ప్యాంట్రీ, నీటి శుద్ధి యంత్రం, రెండు బాటిల్‌ కూలర్స్‌
► కోచ్‌ల్లో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ క్రషర్‌ మెషీన్లు
► డ్రైవర్, గార్డుల మధ్య నేరుగా సమాచారం అందించుకోవటానికి ప్రత్యేకంగా హ్యాండ్‌సెట్‌ ఫోన్లు.

>
మరిన్ని వార్తలు