వైరస్‌ రోగులను సరిహద్దు దాటిస్తున్న పాక్‌..

22 Apr, 2020 18:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ రోగులను భారత్‌లోకి పాకిస్తాన్‌ ఎగుమతి చేస్తోందని జమ్ము కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ బుధవారం వ్యాఖ్యానించారు. గతంలో ఉగ్రవాదులను మన దేశంలోకి పంపిన పాకిస్తాన్‌ తాజాగా కరోనా వైరస్‌ రోగులను పంపుతున్న విషయం వెలుగులోకి వచ్చిందని, ఇది ఆందోళనకరమని ఆయన అన్నారు. పాక్ నుంచి మన దేశంలోకి వచ్చిన కరోనా రోగులు ఇక్కడ వైరస్‌ను వ్యాపించచేస్తున్నారని దుయ్యబట్టారు. పాక్‌ దుశ్చర్యపై మనం మేలుకుని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న సమయంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ విద్రోహ కార్యకలాపాలను సాగిస్తూనే ఉందని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్‌ జమ్ము కశ్మీర్‌లోకి వైరస్‌ రోగులను పంపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పాకిస్తాన్‌లోనూ రోజురోజుకూ కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గం‍టల్లో 533 తాజా కేసులు వెలుగుచూడగా మొత్తం కేసుల సంఖ్య 9749కు చేరుకుంది. కరోనా మహమ్మారితో ఇప్పటివరకూ పాక్‌లో 209 మంది మరణించారు.

చదవండి : ఎన్‌కౌంటర్‌ : నలుగురు ఉగ్రవాదులు హతం

మరిన్ని వార్తలు