జనతా కర్ఫ్యూ.. మెట్రో సేవలు బంద్‌

20 Mar, 2020 16:08 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలంతా ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఈ నేపథ్యంలో ఆదివారం మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలో ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కరోనాపై పోరాటం చేయడం చాలా ముఖ్యమైనదని పేర్కొంది. కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 195 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్రం పలు కఠిన నిర్ణయాలను తీసుకుంది. మార్చి 22 నుంచి వారం రోజులపాటు అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. రైళ్లలో జనసమ్మర్ధాన్ని నివారించే ఉద్దేశంతో తాము ఇస్తున్న పలు రాయితీలను నిలిపివేస్తూ కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీచేసింది. అలాగే పలు రాష్ట్రాలు కూడా కరోనా నియంత్రణలో భాగంగా మార్చి 31వరకు షాపింగ్‌ మాల్స్‌, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేయాలని ఆదేశాలు జారీచేశాయి.

చదవండి : అతను చనిపోయాడన్న వార్తలు అవాస్తవం : విశాఖ కలెక్టర్‌

మరో రెండు కరోనా కేసులు.. మొత్తం 18

మరిన్ని వార్తలు