‘గార్డియనే గడబిడ చేస్తున్నాడు’

1 May, 2019 12:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని కాపాడాల్సిన గార్డియనే గడబిడ చేస్తున్నాడని ప్రధాని నరేంద్ర మోదీపై ఎస్పీ నేత, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌ విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్నోలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్న ప్రధాని మోదీ స్వయంగా ఆయనే దేశంలో గందరగోళం సృష్టించేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. లక్నో బరిలో ఎస్పీ అభ్యర్ధిగా నిలిచిన పూనం సిన్హాను ఆదరించాలని ఆమె కోరారు.

ఎస్పీలోకి కొత్తగా వచ్చిన వారిని సమాదరించడం మన సంప్రదాయమని, వారు ఎక్కడి వారైనా వారిని గెలిపించుకుని, గౌరవించడం తమ విధానమనని జయాబచ్చన్‌ చెప్పుకొచ్చారు. మీరంతా ఆమె విజయానికి సహకరిస్తామని తనకు హామీ ఇవ్వాలని లేకుంటే పూనం తనను ముంబైలో అడుగుపెట్టనీయరని చయత్కరించారు. లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌లో భాగంగా మే 6న లక్నోలో పోలింగ్‌ జరగనుంది. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపును చేపట్టి విజేతలను వెల్లడిస్తారు.

మరిన్ని వార్తలు