పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆ పార్టీ రెబెల్ నేత శరద్ యాదవ్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈనెల 27న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తలపెట్టిన ర్యాలీకి హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించింది. శరద్ యాదవ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఆయన సీనియారిటీ, పార్టీతో సుదీర్ఘ అనుబంధం దృష్ట్యా చర్యలు తీసుకోలేదని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు.
అయితే లాలూ ర్యాలీకి హాజరైతే మాత్రం ఆయన లక్ష్మణ రేఖ దాటినట్టుగా భావించి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. శరద్ యాదవ్ తనకు తానుగా పార్టీని వీడారని, భౌతికంగా ఆయన తమ పార్టీలో లేరని వ్యాఖ్యానించారు. సీఎం అధికార నివాసంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నఅనంతరం త్యాగి విలేకరులతో మాట్లాడుతూ శరద్ యాదవ్ను రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా తొలగించడాన్ని సమర్ధించారు.