'మావాళ్ల జోలికొస్తే నాలుక చీరేస్తా'

2 Mar, 2016 11:43 IST|Sakshi
'మావాళ్ల జోలికొస్తే నాలుక చీరేస్తా'

పాట్నా: బిహార్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్.. బాలికపై అత్యాచారానికి తెబగడి పారిపోగా తాజాగా జేడీ(యూ) ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తన మద్దతుదారుల జోలికివస్తే నాలుక చీరేస్తానంటూ భగల్పూర్ జిల్లా గోపాల్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ హెచ్చరించారు.

నావగాచియా బజార్ ప్రాంతంలో ఆదివారం క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'మా వాళ్లను ఎవరైనా బెదిరిస్తే వాళ్ల నాలుకలు చీరేస్తా. నా రెండు కాళ్లలో ఒకటి జైలులో, మరొకటి బయట ఉంటుంది. ముందు నేను గోపాల్ మండల్ ని, తర్వాతే ఎమ్మెల్యేని. సమాజంలో నాకో స్టేటస్ ఉంద'ని పేర్కొన్నారు.

గోపాల్ మండల్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యేల వ్యవహార శైలి మహా కూటమి పాలనకు అద్దం పడుతోందని బీజేపీ నేత నంద కిశోర్ అన్నారు. గోపాల్ వ్యాఖ్యలపై స్పందించేందుకు సీఎం నితీశ్ కుమార్ నిరాకరించారు. గోపాల్ మండల్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో తన కారును ఆపినందుకు డీఎస్పీ స్థాయి అధికారిపై దౌర్జన్యంగా ప్రవర్తించారు. తనను అవమానించాలని చూస్తే మోదీ ప్రభుత్వాన్నైనా, నితీశ్ సర్కారునైనా లెక్క చేయబోనని అన్నారు.

మరిన్ని వార్తలు