మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్‌

10 Jul, 2017 09:45 IST|Sakshi
మహిళలతో కాళ్లు కడిగించుకున్న సీఎం.. వైరల్‌

జంషెడ్‌పూర్‌: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుభర్‌దాస్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇద్దరు మహిళలతో కాళ్లు కడిగించుకొని పలువురి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా అంటూ పలువురు పెదవి విరిచేస్తున్నారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎందుకు కాళ్లు కడిగించుకున్నారని అనుకుంటున్నారా.. గురుపూర్ణిమ సందర్భంగా గురు మహోత్సవ్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దాస్‌ను ఆహ్వానించారు. అయితే, సాధారణంగా పూలమాల వేసో లేక ఎదురుగా వెళ్లి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చో స్వాగతం పలకడం చేస్తారు. కానీ, ఎప్పుడైతే ఆయన వచ్చారో ఓ ఇద్దరు మహిళలు ఆయనకు ఎదురెళ్లారు. కింద పెద్ద తాంబాళంలాంటిదాన్ని పెట్టారు.

ఆ తర్వాత ఆయన తన పంచెను పైకెత్తి పట్టుకోగా కాళ్లపై గులాబీ రేకులతో నింపి ఉన్న నీళ్లు పోస్తూ కడిగేశారు. అనంతరం లేచి నిల్చొని ఆయనకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో పలువురు సామాజిక కార్యకర్తలు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా హక్కుల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తికి ఇది ఏ మాత్రం తగదని, ఇలాంటి చర్యలు తాము ఏ మాత్రం అంగీకరించబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేత రంజీత్‌ రంజన్‌ స్పందిస్తూ ఇలాంటి స్వాగతం ఆయనకు పలకాలని అనుకున్నప్పుడు అది మహిళలతోనే ఎందుకు ఏర్పాటు చేశారంటూ నిలదీశారు. దీనిపై ఆయన ఇంకా స్పందించలేదు.

మరిన్ని వార్తలు