టీచర్‌ పనితో తల్లిదండ్రుల తికమక

13 Jul, 2020 08:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాంచీ: కిండర్‌ గార్డెన్‌ పిల్లలకు జార్ఖండ్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జాతీయ గీతాలను నేర్పిస్తున్న వ్యవహారం బయటపడతంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు టీచర్‌ జాతి వ్యతిరేకి అని సోషల్‌ మీడియాలో తిట్టిపోస్తున్నారు. తూర్పు సింఘ్‌భూమ్‌ జిల్లా జంషెడ్‌పూర్‌‌ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వెలుగుచూసిన ఈ ఉదంతంపై జిల్లా విద్యాశాఖ యంత్రాంగం విచారణ చేపట్టింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగుతున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది.
(చదవండి: మన సరిహద్దులు ఆర్మీ చేతుల్లో భద్రం)

ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్తున్న ఓ టీచర్‌ బంగ్లా, పాక్‌ జాతీయ గీతాలు నేర్చుకోవాలని చెప్పింది. వాటికి సంబంధిచిన యూట్యూబ్‌ లింకులను వారికి షేర్‌ చేసింది. దాయాది దేశాల జాతీయ గీతాలు నేర్చుకోవడమేంటని తొలుత పిల్లల తల్లిదండ్రులు తికమకపడ్డారు. కొందరు ఇదేంటని అభ్యంతరం చెప్పారు. ఇక ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నేత కునాల్‌ సారంగి ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్‌ యాంటి నేషనల్‌గా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీ వేశామని జిల్లా విద్యాధికారి శివేంద్ర కుమార్‌ చెప్పారు. ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంలో పడుతోందని బీజేపీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ ఆదిత్య సాహు అన్నారు. పిల్లల మెదళ్లలో విషాన్ని నింపాలని చూస్తున్నారని మండిపడ్డారు.
(ఆన్‌లైన్‌ క్లాసులకు ఫోన్‌లు లేకపోవడంతో)

మరిన్ని వార్తలు