జార్ఖండ్‌ పోల్‌ : జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం

23 Dec, 2019 08:48 IST|Sakshi

రాంచీ : ఉత్కంఠభరితంగా సాగిన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. పాలక బీజేపీపై  జేఎంఎం- కాంగ్రెస్‌ కూటమి విస్పష్ట ఆధిక్యం కనబరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జేఎంఎం కాంగ్రెస్‌ కూటమి 42 స్ధానాల్లో ముందంజలో ఉండగా పాలక బీజేపీ 28 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఏజేఎస్‌యూ 3 స్ధానాల్లో, జేవీఎం 3 స్ధానాల్లో, ఇతరులు 5 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 81 స్ధానాలు కలిగిన జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 41కాగా జేఎంఎం కాంగ్రెస్‌ కూటమి కీలక సంఖ్యను దాటే దిశగా సాగుతోంది. మరోవైపు ఆధిక్యాల్లో దోబూచులాటతో ఇరు పక్షాలు చిన్నాచితకా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ జంషెడ్‌పూర్‌ తూర్పు స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ తాను పోటీచేసిన రెండు స్ధానాల్లోనూ తొలుత ఆధిక్యంలో దూసుకుపోగా ఇప్పుడు ఓ స్ధానంలో వెనుకపడ్డారు. కాగా, ఎగ్జిట్‌ పోల్స్‌ హంగ్‌ అసెంబ్లీ వస్తుందని, జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి స్వల్ప ఆధిక్యత కనబరుస్తుందన్న అంచనాలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలుత బీజేపీ పలు స్ధానాల్లో ఆధిక్యం కనబరిచినా జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి దీటైన పోటీ ఇస్తూ పాలక బీజేపీపై విస్పష్ట ఆధిక్యంతో ముందుకు సాగుతోంది.

మరిన్ని వార్తలు