కశ్మీర్‌లో ఉగ్రదాడులు

29 Oct, 2019 02:29 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ట్రక్‌ డ్రైవర్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఉదంపూర్‌ జిల్లాలోని కట్రాకు చెందిన నారాయణ్‌ దత్‌ను సోమవారం సాయంత్రం తుపాకీతో కాల్చి చంపారు. కాల్పుల శబ్దం వినగానే దగ్గర్లోనే ఉన్న సీనియర్‌ పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని దగ్గర్లోనే ఉన్న మరో ఇద్దరు ట్రక్‌ డ్రైవర్లను కాపాడారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా బిజ్‌బెహరాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం నలుగురు ట్రక్‌ డ్రైవర్లను ఉగ్రవాదులు కాల్చి చంపడం గమనార్హం. మరణించిన వారంతా కశ్మీరీయేతర ప్రాంతాలకు చెందినవారే.  

కశ్మీర్‌లో గ్రెనేడ్‌ దాడి..
కశ్మీర్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్‌ దాడి చేశారు. నగరంలోని ఓ బస్‌స్టాప్‌ వద్ద వేచి ఉన్న జనాలే లక్ష్యంగా గ్రెనేడ్‌ విసిరారు. ఈ పేలుడులో 20 మంది ప్రజలు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన చుట్టుపక్కల్లో ప్రాంతాల్లో సోదాలు మొదలుపెట్టారు.

మరిన్ని వార్తలు