జేఎన్‌యూలో ఉద్రిక్తత

12 Nov, 2019 04:46 IST|Sakshi

ఫీజుల పెంపు ప్రతిపాదనపై విద్యార్థుల ఆందోళన

పలువురు విద్యార్థుల అరెస్ట్‌

న్యూఢిల్లీ: ఫీజుల పెంపును నిరసిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్‌ గది అద్దె, మెస్‌ ఛార్జీల పెంపు, డ్రెస్‌కోడ్‌లను విధించేందుకు వీలుగా హాస్టల్‌ మాన్యువల్‌లో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు నిరసనబాట పట్టారు. జేఎన్‌యూ నుంచి విద్యార్థుల నిరసనర్యాలీ మొదలైంది. దగ్గర్లోని ఏఐసీటీఈ ఆడిటోరియంకు సమీపానికి రాగానే పోలీసులు వారిని నిలువరించారు.

ఆడిటోరియంలో స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతున్నపుడు బయట విద్యార్థుల ఆందోళన కొనసాగింది.  పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నాతకోత్సవం తర్వాత వెంకయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఆడిటోరియం ప్రాంతాన్ని విద్యార్థులు చుట్టుముట్టడంతో  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ దాదాపు ఆరు గంటలపాటు ఆడిటోరియంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల అభ్యంతరాలు, డిమాండ్లన్నింటినీ పరిశీలిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు