‘ముసుగు దుండగులను గుర్తిస్తా’

6 Jan, 2020 15:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం చీఫ్‌ ఐషే ఘోష్‌ ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం సాయంత్రం క్యాంపస్‌లోకి ప్రవేశించి హాకీస్టిక్‌లు, ఇనుపరాడ్లతో తమపై దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. దుండగుల దాడిలో తలపై గాయాలైన ఘోష్‌ తాను కోలుకున్న అనంతరం ఏబీవీపీ దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏబీవీపీ సభ్యులపై తాము సమిష్టి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు.

విద్యార్ధులపై ఇనుప రాడ్లతో దాడి చేసిన వారిలో కొందరి ముఖాలను తాను గుర్తుపట్టగలనని, ఘర్షణలు చెలరేగిన క్రమంలో పెనుగులాటలో కొందరి ముసుగులు చెదిరిపోయాయని చెప్పారు. దుండగుల దాడిలో దాదాపు 30 మంది జేఎన్‌యూ విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఐషూ ఘోష్‌ తలపై తీవ్ర గాయమై రక్తమోడుతూ ఆదివారం రాత్రి టీవీల్లో కనిపించారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దుండగుల హింసాకాండపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి.

చదవండి : జేఎన్‌యూ దాడిపై ఉద్ధవ్‌ ఠాక్రే ఫైర్‌

మరిన్ని వార్తలు