-

దేవుడి మీదే భారం.. ప్రార్థించండి: అపోలో ఆస్పత్రి

12 Dec, 2016 14:53 IST|Sakshi
దేవుడి మీదే భారం.. ప్రార్థించండి: అపోలో ఆస్పత్రి
గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కోసం తాము దేవుడిని ప్రార్థిస్తున్నామని, తమతో పాటు అందరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిన జయలలిత (68) గుండె, ఊపిరితిత్తులకు ప్రత్యేక పరికరాలతో మద్దతు అందిస్తున్నామని చెప్పాయి. 
 
సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత దాదాపు కోలుకుంటున్నారని, ఇంక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా ఇంతకుముందు అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి చెప్పారు. కానీ అంతలోనే మళ్లీ అమ్మ ఆరోగ్యం విషమించింది. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి పలు ట్వీట్లు చేసింది. ఆమెకు 'ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్' అమర్చామని, పలువురు నిపుణులైన వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది. ఇప్పుడు ఆమెకు ఏ తరహా చికిత్స అందించాలన్న విషయమై లండన్‌కు చెందిన వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలేని కూడా సంప్రదిస్తున్నట్లు తెలిపింది. ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరింది.
మరిన్ని వార్తలు