యూపీలో 74 స్ధానాలు మావే..

16 Jan, 2019 19:07 IST|Sakshi

లక్నో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 80 స్ధానాలకు గాను 74 స్ధానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి, యూపీ బీజేపీ లోక్‌సభ ఇన్‌చార్జ్‌ జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రభావం ఉండదని తేల్చిచెప్పారు. యూపీ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రాజధాని లక్నోకు వచ్చిన నడ్డా బుధవారం పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో 71 స్ధానాలు గెలుపొందిన బీజేపీ ఈసారి 74 స్ధానాలను కైవసం చేసుకుంటుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. యూపీలో అన్ని రికార్డులు బద్దలుకొట్టి అత్యధిక స్ధానాలను గెలుపొందుతామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు. ప్రజల్లో ప్రధాని మోదీకి లభిస్తున్న ఆదరణ బీజేపీకి ఓట్లరూపంలో లాభిస్తుందన్నారు. యూపీలో అభివృద్ధే తమ అజెండా అని, కులరాజకీయాలకు తమ పార్టీ అతీతమని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు