ఆ జడ్జి దేశం వదిలి వెళ్లిపోయారా?

11 May, 2017 14:17 IST|Sakshi
ఆ జడ్జి దేశం వదిలి వెళ్లిపోయారా?

పదవిలో ఉండగా ఆరు నెలల జైలుశిక్ష పడిన మొట్టమొదటి న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ ఎక్కడున్నారన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. కలకత్తా హైకోర్టుకు చెందిన ఈ న్యాయమూర్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారని కొంతమంది చెబుతుండగా ఆయన సన్నిహితులు మాత్రం భారతదేశంలోనే ఎవరికీ తెలియని ఓ ప్రదేశంలో ఉన్నారంటున్నారు. ఆయన అరెస్టును తప్పించుకోడానికి ఏమీ ప్రయత్నించడం లేదని, అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం అడుగుతున్నారని ఆయన అనుచరులు మీడియాకు చెప్పారు. తమిళనాడులోని ఓ గెస్ట్‌హౌస్‌లో ఉన్నారని కథనాలు రావడంతో పశ్చిమబెంగాల్ నుంచి పోలీసు బృందం చెన్నైకి వెళ్లినా, అక్కడ ఆయన కనిపించలేదు. తనపై జారీచేసిన అరెస్టు ఉత్తర్వులను రీకాల్ చేసుకోవాలని కర్ణన్ సుప్రీంకోర్టును కోరారు.

కర్ణన్ బృందం కొత్తగా ఒక రివ్యూ దరఖాస్తు సిద్ధం చేస్తోందని, త్వరలోనే దాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేస్తారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పూర్తికాపీ అందితే గానీ పిటిషన్ దాఖలు చేయడానికి గానీ, బెయిల్ కోసం దరఖాస్తు చేయడానికి గానీ కుదరదు. కుల్‌భూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో సవాలు చేసినట్లే తన కేసును కూడా అక్కడకు పంపాలని రాష్ట్రపతిని అడిగేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కూడా కర్ణన్ కోరినట్లు తెలిసింది. అయితే.. జస్టిస్ కర్ణన్‌ను అరెస్టు చేస్తే ఆయన స్వగ్రామంలో అల్లర్లు చెలరేగుతాయని తమిళనాడు ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతోంది. మొత్తానికి జస్టిస్ కర్ణన్ బయటకు రాకుండా వీలైనంత వరకు తప్పించుకోడానికే ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు