సీజేఐగా జస్టిస్‌ బాబ్డే

19 Nov, 2019 03:57 IST|Sakshi
ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్‌ బాబ్డే అభివాదం. చిత్రంలో వీల్‌చైర్‌లో ఆయన తల్లి

న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరవింద్‌ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆంగ్లంలో దేవుడి పేరున ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన.. వీల్‌చైర్‌లో ఆ కార్యక్రమానికి వచ్చిన తన తల్లికి పాదాభివందనం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య, కొందరు సీనియర్‌ మంత్రులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఆర్‌.ఎం.లోధా, టీఎస్‌.ఠాకూర్, జేఎస్‌.కెహార్‌ హాజరయ్యారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ బాబ్డే సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ శ్రీనివాస్‌ బాబ్డే కుమారుడు.   2021 ఏప్రిల్‌ 23 వరకు మొత్తం 17 నెలల పాటు జస్టిస్‌ బాబ్డే ఈ పదవిలో కొనసాగుతారు.  

నూతన సీజేఐకి నెటిజన్ల ప్రశంసలు
ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్‌ బాబ్డే వీల్‌చైర్‌లో వచ్చిన తన మాతృమూర్తి(92)కి పాదాభివందనం చేయడం పలువురి ప్రశంసలు అందుకుంది. తల్లికి జస్టిస్‌ బోబ్డే పాదాభివందనం చేస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పలువురు నెటిజన్లు ఆయన్ను మెచ్చుకున్నారు.
 

మరిన్ని వార్తలు