కశ్మీర్‌పై కమల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

18 Feb, 2019 16:49 IST|Sakshi

సాక్షి, చెన్నై: పుల్వామా దాడిని అఖండ భారతా వని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగుతోంది.  రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అమరజవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ సమయంలోనే కశ్మీర్‌పై కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సినీ హీరో, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమలహాసన్‌ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

‘పుల్వామా ఘటన చాలా బాధాకరం. ఇంత విధ్వంసకాండ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో ప్రజాభిప్రాయం ఎందుకు సేకరించడం లేదు. అక్కడి ప్రజలు కోరుకున్నట్లుగా చేయాలి’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా కశ్మీర్‌ వేర్పాటువాదులు కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. కమల్‌ వ్యాఖ్యలతో ఇంటాబయటా రచ్చ జరగడంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. కమల్‌ వ్యాఖ్యలను కావాలని కొందరు వక్రీకరించారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ ఆరోపించింది. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని పేర్కొంది. సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. (కాపీ కొడతారా! సిగ్గు లేదా: కమల్‌ ఫైర్‌)

మరిన్ని వార్తలు