భారత ఖ్యాతిపై బురదజల్లేందుకే..

27 Jul, 2019 04:21 IST|Sakshi
కంగనా రనౌత్‌, ప్రసూన్‌ జోషి

మూకదాడులకు నిరసనగా ప్రధానికి లేఖ

రాసిన వారికి కౌంటర్‌

కంగనా రనౌత్, ప్రసూన్‌ జోషి సహా 61 మంది లేఖ

ముంబై: అంతర్జాతీయంగా భారత్‌ ఖ్యాతికి నష్టం వాటిల్లేలా, ప్రధాని నరేంద్ర మోదీపై బురద చల్లేందుకే కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సహా 61 మంది బాలీవుడ్‌ ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, ద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయని 49 మంది ప్రముఖులు ప్రధానికి ఇటీవల లేఖ రాసిన లేఖకు వీరు కౌంటర్‌ ఇచ్చారు. మంచి పాలన అందించేందుకు, మనవత్వాన్ని చాటేందుకు, నిజమైన జాతీయవాదాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్న నరేంద్రమోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని వారు మండిపడ్డారు.

ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో గీత రచయిత ప్రసూన్‌ జోషి, డ్యాన్సర్‌ సోనల్‌ మాన్‌సింగ్, డైరెక్టర్లు మధుర్‌ భండార్కర్, వివేక్‌ అగ్నిహోత్రి తదితరులు ఉన్నారు.  మూకదాడులకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ చాలాసార్లు మాట్లాడారని గుర్తు చేశారు. మూక దాడులపై చట్టాలు చేసుకునేందుకు రాష్ట్రాలకు మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు.  పేదలు నక్సలిజం, ఉగ్ర బాధితులుగా మారినప్పుడు ఈ మేధావు లంతా ఏం చేశారని ప్రశ్నించారు. భారత్‌ను విడగొట్టాలని కశ్మీర్‌లో వేర్పాటువాదులు డిమాండ్‌ చేసినప్పుడు, పాఠశాలలను దహనం చేస్తామని హెచ్చరించినప్పుడు వీరంతా ఎక్కడికి పోయారన్నారు. జై శ్రీరాం అని నినదిస్తే హత్యలు చేసినప్పుడు, కశ్మీర్‌ లోయ నుంచి కశ్మీరీ పండిట్లను, ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా నుంచి హిందువులను వెళ్లగొట్టినప్పుడు వీరెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు