మరో సంచలనానికి కన్హయ్య రెడీ

28 Apr, 2016 09:50 IST|Sakshi
మరో సంచలనానికి కన్హయ్య రెడీ

న్యూఢిల్లీ: జాతీయవాదం, స్వేచ్ఛవాదంపై జాతీయస్థాయిలో తీవ్రమైన చర్చకు కారకుడైన జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. తనకెదురైన అనుభవాలను అక్షర బద్ధం చేయనున్నాడు. తన జీవితానుభవాలను పుస్తకంగా తీసుకురానున్నాడు. స్కూల్ నుంచి స్టూడెంట్ పాలిటిక్స్ దాకా సాగిన ప్రయాణం గురించి ఇందులో పొందుపరచనున్నాడు.

బిహార్ నుంచి తీహార్ వరకు తన జీవితంలో జరిగిన ఘటనలను పుస్తకంలో రాయనున్నాడు. బిహార్ లో గడిచిన స్కూల్ జీవితం, విద్యార్థి రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర, జాతిద్రోహంలో అరెస్ట్, జైలు నుంచి బయటివచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించనున్నాడు. ఈ పుస్తకానికి 'బిహార్ టు తీహార్' అని పేరు పెట్టాడు.

'వ్యక్తులను చంపగలరు కానీ వాళ్ల ఆశయాలను చంపలేరని భగత్ సింగ్ అన్నారు. మేం చేస్తున్న పోరాటం మమ్మల్ని ఎక్కడివరకు తీసుకెళుతుందో తెలియదు. కానీ మా ఆశయాలు పుస్తక రూపంలో చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నామ'ని 28 ఏళ్ల కన్హయ్య కుమార్ అన్నాడు. తరతరాలుగా భారతీయ సమాజంలో కొనసాగుతున్న వైరుధ్యాలను, యువత ఆశ-నిరాశలు, పోరాటాల గురించి రాస్తానని చెప్పాడు. అతడి పుస్తకాన్ని జాగర్ నట్ ప్రచురించనుంది.

మరిన్ని వార్తలు