అరుదైన ఫోటో ట్వీట్‌ చేసిన కపిల్‌ సిబల్‌

24 Aug, 2019 15:21 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (66) మృతి పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మృతికి సంతాపం తెలుపుతూ.. ఆయనకు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను ట్వీట్‌ చేశారు కపిల్‌ సిబల్‌. ‘క్రికెట్‌లో మేమిద్దరం’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఫోటోతో పాటు.. ‘అరుణ్‌ జైట్లీ మరణించారనే వార్త నన్ను తీవ్రంగా కలిచి వేసింది. నా పాత స్నేహితుడు.. ప్రియమైన సహోద్యోగి. రాజకీయాల్లో గానీ, దేశ ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలు కలకాలం నిలిచి ఉంటాయి. అరుణ్‌ జైట్లీ పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. తన స్నేహితుల కోసం, పార్టీ కోసం స్థిరంగా నిలబడ్డారు’ అంటూ కపిల్‌ సిబల్‌ ట్వీట్‌ చేశారు.
 

అంతేకాక అరుణ్‌ జైట్లీతో కలిసి గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు కపిల్‌ సిబల్‌. ఈ సందర్భంగా అరుణ్‌ జైట్లీతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అరుణ్‌ జైట్లీ క్రికెట్‌కు వీరాభిమాని అనే సంగతి అందరికి తెలిసిందే. ఓ దశాబ్దం పాటు ఆయన ఢిల్లీ, డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ)కు అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జైట్లీ తీవ్రంగా కృషి చేశారు. అయితే క్రికెట్‌ నిర్వహకుడిగా అరుణ్‌ జైట్లీ కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు.

మరిన్ని వార్తలు