అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ టాప్‌

5 Sep, 2019 02:56 IST|Sakshi
‘చిన్న ఉపగ్రహాలు– ప్రయోజనాలు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వర్ధ, తదితరులు

ఘనంగా ప్రారంభమైన ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ సదస్సు  

సాక్షి ప్రతినిధి, బెంగళూరు: అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ నాలుగో అగ్రగామిగా ఖ్యాతి దక్కించుకుందని ఇజ్రాయెల్‌కు చెందిన ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త బ్రిగ్‌ జెన్‌ (ఆర్‌ఈఎస్‌) ప్రొఫెసర్‌ చైమ్‌ ఈష్డె పేర్కొన్నారు. బెంగళూర్‌ వేదికగా ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌– 2019 సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమత్రి  అశ్వర్ధ నారాయణ పాల్గొని మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు  

అంతరిక్ష విప్లవం
భారత్‌ ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో విప్లవం రానుందని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్త బ్రిగ్‌ జెన్‌ అన్నారు. యువ శక్తిశీల దేశమైన భారత్‌లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అపారమన్నారు. ప్రత్యేకించి సైన్స్‌ , ఇంజినీరింగ్‌ సాంకేతికతలో అద్భుతాలు సృష్టించే యువత భారత్‌కు అమూల్యమైన సంపద అంటూ కొనియాడారు. భారత్‌ చంద్రయాన్‌–2ను విజయవంతంగా నింగికి పంపి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కించుకుందన్నారు.   

భారత యువతకు ఆ సత్తా
కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇజ్రాయిల్‌ టు సౌత్‌ ఇండియా ప్రత్యేక అతిథిగా హాజరైన డానా కుర్‌‡్ష మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనల్లో అంకితభావంతో కృషి చేస్తున్న యువత పనితీరు ప్రశంసనీయన్నారు. భారత్, ఇజ్రాయెల్‌ అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యంతో చేస్తున్న కృషిని కొనియాడారు. ఇండో–ఇజ్రాయెల్‌ స్పేస్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్, నీటి నిర్వహణ తదితర రంగాల్లో భారత్‌కు సహకరిస్తామన్నారు.  

75 ఏళ్లు.. 75 ఉపగ్రహాలు
2022కు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆ సందర్భంగా 75 విద్యార్థి రూపకల్ప ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చొరవ చూపిస్తామని ఐటీసీ–2019 చైర్మన్‌ మురళీకృష్ణా రెడ్డి అన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 7 విద్యార్థి రూపకల్పన ఉపగ్రహాలు ఉన్నాయన్నారు. ఐటీ, బీటీ రంగాలే రేపటి భవిష్యత్తు అని అటల్‌జీ మాటలను పద్మశ్రీ డాక్టర్‌ వాసుగం గుర్తుచేశారు. ఈ సదస్సులో 7 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ ఇంజినీర్స్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఉడే పి.కృష్ణ, ప్రొఫెసర్‌ ఎంఆర్‌ ప్రాణేష్, డాక్టర్‌ బీవీఏ రావులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు