తబ్లిగీ సభ్యులపై పొగడ్తలు: అధికారికి నోటీసులు

2 May, 2020 16:30 IST|Sakshi

వైరల్‌గా మారిన ఐఏఎస్‌ అధికారి ట్వీట్‌.. స్పందించిన ప్రభుత్వం

సాక్షి, బెంగళూరు : తబ్లిగీ జమాత్‌కు చెందిన సభ్యులను పొగుడుతూ కామెంట్లు చేసిన ఓ ఐఏఎస్‌ అధికారికి ప్రభుత్వం షోకాజు నోటీసులు  జారీ చేసింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..  మహ్మద్‌ మోహ్‌సిన్‌ అనే ఐఏఎస్‌ అధికారి కర్ణాటక బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. గత నెల 27న తన ట్విటర్‌ ఖాతాతో తబ్లిగీ సభ్యులపై స్పందిస్తూ.. ‘‘ ఒక్క ఢిల్లీలోనే మూడు వందలకుపైగా తబ్లిగీ హీరోలు దేశానికి సేవ చేయటానికి తమ ప్లాస్మాను దానం చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు.. గోదీ మీడియా? తబ్లిగీ హీరోలు చేస్తున్న మంచి పనులను వారు ప్రజలకు చూపించరు’’ అని కామెంట్‌ చేశారు.(తబ్లిగీ జమాత్ చీఫ్‌కు ఐదోసారి నోటీసులు)

ఈ ట్వీట్‌ కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి మీడియా సైతం ఈ ట్వీటును హైలెట్‌ చేసింది. దీంతో స్పందించిన ప్రభుత్వం సదరు అధికారికి షోకాజు నోటీసులు జారీ చేసింది. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ రూల్స్‌ 1968ను అతిక్రమించినందుకు గానూ ఐదు రోజుల్లో రాత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ( 24 గంటలు..77 మరణాలు)

మరిన్ని వార్తలు