సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హై కోర్టు

25 Jun, 2020 12:06 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక హై కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ‘అత్యాచారం జరిగిన తర్వాత ఓ భారతీయ మహిళ నిద్రపోవడం అనేది అసాధరణమైన విషయం’ అని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడు రాకేశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. బార్ అండ్ బెంచ్‌లోని నివేదిక ప్రకారం.. జస్టిస్ కృష్ణ తీర్పు వెల్లడిస్తూ.. ‘ఈ దారుణం జరిగిన తరువాత అలసిపోయి నిద్రపోయానని సదరు యువతి వివరణ ఇచ్చింది. తన జీవితం నాశనం అయ్యిందని తెలిసిన తర్వాత ఓ మహిళ స్పందన ఇలా ఉండదు. మరి ముఖ్యంగా భారతీయ మహిళలు ఎవరు ఇలా స్పందించరు’ అని పేర్కొన్నారు. అంతేకాక బెయిల్ మంజూరు చేయడానికి మరొక కారణం ఏమిటంటే, బాధితురాలు రాత్రి 11 గంటలకు నిందితుడి కార్యాలయానికి ఎందుకు వెళ్లిందో వివరించడంలో విఫలమయ్యిందని తెలిపారు. అంతేకాక నేరం జరిగినట్లు ఆరోపించిన నాటి రాత్రి ఆమె నిందితుడితో కలిసి మద్యం తాగడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అని జస్టిస్‌ కృష్ణ పేర్కొన్నారు. (‘డేటింగ్‌ ఫ్రెండే’ దోచేసింది)

ఇదిలావుండగా, బెయిల్ మంజూరు చేస్తూ నిందితుడు రాకేష్‌కు కోర్టు అనేక షరతులు విదించింది. నిందితుడు అనుమతి లేకుండా ట్రయల్ కోర్టు అధికార పరిధి దాటి వెళ్లకూడదని తెలిపింది. ప్రతి నెల ప్రతి రెండవ, నాల్గవ శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలు గత రెండేళ్లుగా నిందితుడి వద్ద పని చేస్తుంది. అయితే వివాహం చేసుకుంటానని చెప్పి రాకేష్‌ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది.

మరిన్ని వార్తలు