కర్ణాటక గనుల వేలంకు స్పందన కరువు

27 Sep, 2016 19:12 IST|Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటకలోని ఇనుప ఖనిజ గనుల ఈ–వేలం పాటకు ప్రైవేటు సంస్థల నుంచి ఆశించినంత స్పందన రాకపోవడంతో మిగిలిపోయిన గనుల్ని కలిపి వేలం పాట వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు ఈ అంశానికి సంబంధించి త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ వేలం పాట రెండవ దశలో మొత్తం 14 మైనింగ్‌ గనులకు గాను ఎన్‌ఎండీసీ, జిందాల్, వేదాంత సంస్థలతో మరికొన్ని సంస్థలు ఏడు మైనింగ్‌ గనులను దక్కించుకోగా ఏడు మైనింగ్‌ గనులు మిగిలిపోయాయి.

అయితే ఆ మైనింగ్‌ గనుల్లో తగినంత ఇనుప ఖనిజం నిల్వలు లేకపోవడంతోపాటు తక్కువ నాణ్యత కారణంగానే ఏ సంస్థలు వాటిపట్ల ఆసక్తి చూపించలేదని ఓ ప్రభుత్వాధికారి వెల్లడించారు. దీనికి పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రైవేటు కంపెనీలకు అనుగుణంగా ఈ ఏడు మైనింగ్‌ గనుల్ని కలిపి మొత్తం 14 మైనింగ్‌ గనులకు ఒకేసారి వేలం పాట వేసేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇదే సమయంలో ఈ అంశానికి సంబంధించి కేంద్ర మైనింగ్‌ మంత్రిత్వశాఖతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు