ఆలస్యం నోటీసుకు వినూత్న జవాబు​​​​​​​

16 Apr, 2019 09:18 IST|Sakshi

బనశంకరి : విధులకు ఆలస్యంగా హాజరైనందుకు కారణం చెప్పాలని నోటీస్‌ ఇచ్చిన జయనగర పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యర్రిస్వామికి కానిస్టేబుల్‌ శ్రీధర్‌గౌడ ఇచ్చిన సమాధానం పోలీస్‌శాఖలో తీవ్రచర్చకు దారితీసింది. జయనగర పోలీస్‌స్టేషన్‌లో 5 మంది గస్తీ సిబ్బంది నిత్యం విధులకు ఆలస్యంగా వస్తున్నారని సీఐ వారికి నోటీసులు అందించారు. ఈ నోటీసులకు కానిస్టేబుల్‌ శ్రీధర్‌గౌడ సీఐ వ్యవహారశైలిని ప్రస్తావిస్తూ ఘాటుగా లేఖ రాయడం తీవ్ర చర్చకు దారితీసింది. 

ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే.. ‘మీ మాదిరిగా ఉదయం సుఖసాగర్‌ లేదా యుడి హోటల్‌లో టిఫిన్, మధ్యాహ్నం ఖానావళిలో భోజనం, రాత్రి ఎంపైర్‌లో భోజనం, మిలనోలో ఐస్‌క్రీం తిన్న తరువాత పోలీస్‌స్టేషన్‌ పైన ఉన్న గదిలో నివాసం ఉండేట్లయితే నేను కూడా ఉదయం తీరిగ్గా విధులకు హాజరయ్యేవాణ్ని. కానీ నాకు వయసు మీదపడిన తల్లిదండ్రులు, పోలీస్‌శాఖలో పనిచేసే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఆలనపాలన చూసిన అనంతరం పోలీస్‌స్టేషన్‌కు రావడం ఆలస్యమౌతుంది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదు’ అని శ్రీధర్‌గౌడ సమాధానమిచ్చారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉంటుందోనని కుతూహలం నెలకొంది.

మరిన్ని వార్తలు