కార్తీకి మరో మూడు రోజుల కస్టడీ

7 Mar, 2018 02:28 IST|Sakshi
కార్తీ చిదంబరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టు, ఢిల్లీ స్థానిక కోర్టుల్లోనూ ఊరట లభించలేదు. ఆయన సీబీఐ కస్టడీని ఢిల్లీ స్థానిక కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. బెయిల్‌ పిటిషన్‌ను సైతం వాయిదా వేసింది. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కార్తీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కార్తీ ఐదు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మంగళవారం అతడిని సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయమూర్తి సునీల్‌రాణా ఎదుట హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయని, వీటిలో కార్తీ పాత్రపై వాస్తవాలు తెలియాలంటే విచారణ తప్పనిసరి అని, అందువల్ల కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది.  కార్తీని ముంబై తీసుకువెళ్లి ఐఎన్‌ఎక్స్‌ మీడియా మాజీ ప్రమోటర్, ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జియాతో కలిపి విచారించాల్సి ఉందని, ఈ కేసులో ఆమె వాంగ్మూలం ఓ కీలక ఆధారమని విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు