కార్తీ చిదంబరం ఆస్తుల జప్తు

12 Oct, 2018 03:44 IST|Sakshi
కార్తీ చిదంబరం

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీ లాండరింగ్‌ కేసులో దేశ, విదేశాల్లో ఉన్న రూ.54 కోట్ల విలువైన కార్తీ చిదంబరం ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గురువారం ప్రకటించింది. తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్‌లలో ఉన్న సాగు భూమి, బంగళా, ఢిల్లీలో కార్తీ, అతని తల్లి నళిని పేరిట ఉన్న రూ.16 కోట్ల ఖరీదైన ఫ్లాట్, బ్రిటన్‌లోని సోమర్సెట్‌లో ఉన్న రూ.8.67 కోట్ల కాటేజీ, ఇల్లు, స్పెయిన్‌లోని బార్సిలోనాలో రూ.14.57 కోట్ల టెన్నిస్‌ క్లబ్‌లను మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) ప్రకారం జప్తు చేస్తున్నట్లు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై బ్యాంకులోని కార్తీకి, అతనికి చెందినదిగా భావిస్తున్న అడ్వాంటేజ్‌ స్ట్రాటెజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏఎస్‌సీపీఎల్‌) పేరుతో ఉన్న రూ.90 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను కూడా జప్తు చేస్తున్నట్లు తెలిపింది. ’అటాచ్‌మెంట్‌ ఉత్తర్వు చట్ట విరుద్ధం..హాస్యాస్పదం, అనాగరికం. వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం పిచ్చి ఊహాగానాలతో తీసుకున్న చర్య. వార్తల్లోకి ఎక్కటమే దీని వెనుక ఉద్దేశం’ అని కార్తీ అన్నారు.

మరిన్ని వార్తలు