శ్రీనగర్: వరదబాధిత జమ్మూకాశ్మీర్లో జన జీవనం క్రమంగా మామూలు స్థితికి చేరుకుంటోంది. పలు ప్రాంతాల్లో వరదనీరు తగ్గడం, వివిధ కాలనీల్లో నీటిని హెవీడ్యూటీ పంపుసెట్లతో తోడివేయడం వంటి పరిణామాల మధ్య నెమ్మదిగా మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. 13 రోజుల తర్వాత జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. అయితే, వరదల నష్టం ఎంతన్నది ఇంకా తేలవలసి ఉంది. పలు ప్రాంతాల్లో వరదనీరు తగ్గడం, జీలం నదిలో ప్రవాహం చాలావరకు తగ్గడంతో బాధితులు తమ సొంతఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. బాధితులు ఖాళీ చేసిన ఇళ్లలో చోరీలు జరిగినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి.
రూ. 1.52కోట్ల అమెరికా సాయం
కాశ్మీర్ వరద బాధితుల కోసం అమెరికా రూ. 1.52కోట్ల (2.50లక్షల డాలర్లు) సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు అమెరికా దౌత్య ప్రతినిధి కాథలీన్ స్టీఫెన్స్ ఢిల్లీలో తెలిపారు.