కఠువా రేప్‌ ఓ చిన్న ఘటన

1 May, 2018 01:30 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌ కొత్త డిప్యూటీ సీఎం కవీందర్‌ గుప్తా

జమ్మూ: జమ్మూకశ్మీర్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కొన్నిగంటలు కూడా గడవకముందే బీజేపీ నేత కవీందర్‌ గుప్తా(59) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కఠువాలో అసిఫా(8) అనే బాలికను అత్యాచారం చేసి, హత్యచేయడం చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సత్పాల్‌ శర్మ, గుప్తాతో పాటు మరో ఆరుగురు సోమవారం బీజేపీ–పీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేరారు.

ఈ సందర్భంగా కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించినందుకే బీజేపీ నేతల్ని తప్పించారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. ‘కఠువాలో జరిగింది ఓ చిన్న ఘటనే. ఇలాంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో మనం ఆలోచించాలి. ఇలాంటి చాలా సమస్యల్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ ఒక్క ఘటనకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు’ అని గుప్తా పేర్కొన్నారు. కాగా,  కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజీవ్‌ జస్‌రోటియాకు మంత్రివర్గంలో చోటుదక్కడం గమనార్హం.

మరిన్ని వార్తలు