మమత, నవీన్‌లకు మద్దతుగా కేజ్రీవాల్‌

22 May, 2020 17:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉంఫాన్‌ తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌, ఒడిశాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ రెండు ప్రభుత్వాలు తీసుకుంటున్న చొరవను కేజ్రీవాల్‌ అభినందించారు. ఈ సంక్షోభ సమయం‍లో మా వంతుగా మేము మీకు ఏవిధంగా సహాయపడగలమో తెలియజేయండి అంటూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఢిల్లీ సీఎం కోరారు. తీవ్ర తుఫాను కారణంగా పశ్చిమబెంగాల్‌లో ఇప్పటి వరకు దాదాపు 77 మంది మరణించినట్లు సమాచారం. చదవండి: ఉంపన్‌ విధ్వంసం : 72 మంది మృతి

ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్‌, కోల్‌కతా, హౌరా, హూగ్లీ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు, మౌళిక సదుపాయాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో బెంగాల్‌, ఒడిశాలకు తమకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయపడతామని కేజ్రీవాల్‌ భరోసా కల్పించారు. సంక్షోభంలో ఉన్న రెండు రాష్ట్రాలను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందంటూ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. కాగా ఉంఫాన్‌ తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు ప్రధాని నరేంద్రమోదీ తక్షణ సాయంగా రూ.1000 కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 
చదవండి: తక్షణ సహాయం ప్రకటించిన ప్రధానమంత్రి

మరిన్ని వార్తలు