‘మీ బాస్‌లాగా అసత్యాలు చెప్పకండి’

26 Mar, 2019 18:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేం‍ద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా లోక్‌పాల్‌ బిల్లును తొక్కిపెట్టిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఢిల్లీ ప్రజల జీవన స్ధితిగతులను మెరుగుపరిచేందుకు ఆప్‌ సర్కార్‌ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపణలను కేజ్రీవాల్‌ తోసిపుచ్చారు. ‘మీ బాస్‌ (మోదీ) తరహాలో మీరు అసత్యాలు ప్రచారం చేయరా’దని రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఆయన హితవు పలికారు.

ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం అజమాయిషీ చెలాయించినా తాము ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టామని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. ఢిల్లీ పౌరులకు ఉచిత నీటి సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఢిల్లీలో మూడేళ్ల పాటు సీసీటీవీ కెమెరాలను మోదీ నిలిపివేస్తే ఆప్‌ మం‍త్రులు మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర కుమార్‌ జైన్‌ వారం రోజులు నిరాహార దీక్ష చేపట్టి సీసీటీవీ కెమెరాల ఏర్పాటును సాధించుకున్నారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు