కేరళ నటి నకిలీ నోట్ల రాకెట్‌ గుట్టు రట్టు

6 Jul, 2018 02:54 IST|Sakshi

రూ.57 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

పెరబూరు (చెన్నై): కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బుల్లితెర నటి సూర్య శశికుమార్‌ నకిలీ నోట్ల ముద్రణ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇరుక్కి సమీపంలోని అణక్కరై ప్రాంతంలో గత కొన్ని రోజుల క్రితం కేరళ పోలీసులు చేసిన శోధనల్లో రూ.2.5 లక్షల నకిలీ నోట్లతో లియో, కృష్ణకుమార్, రవీంద్రన్‌ అనే ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు.

వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా సూర్య శశికుమార్‌(36) ఇంట్లో నకిలీ నోట్లు ముద్రిస్తున్న విషయం బయటపడింది. పోలీసులు సూర్య శశికుమార్‌ ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.57 లక్షల నకిలీనోట్లు, వాటిని ముద్రిస్తున్న కంప్యూటర్, ప్రింటర్‌ లభించాయి. దీంతో సూర్య శశికుమార్‌ను, ఆమె తల్లి రమాదేవి, చెల్లెలు శృతిలను అరెస్ట్‌ చేసి విచారించారు.

సూర్య శశికుమార్‌కు బీజూ అనే దొంగ స్వామీజీ ద్వారా దొంగనోట్ల ముఠాతో సంబంధాలు ఏర్పడినట్లు విచారణలో తెలిసింది. ఆమెకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు వెల్లడైంది. సూర్య శశికుమార్‌ దొంగనోట్లను కేరళ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడులోనూ విస్తరింపజేయడానికి ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకుందని తేలటంతో కేరళ పోలీసులు తమిళనాడులోనూ దర్యాప్తు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు