కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కన్నుమూత

21 Nov, 2018 09:31 IST|Sakshi

కొచ్చి: వయానాడ్‌ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఐ షానవాస్‌ కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట కాలేయ మార్పిడి చికిత్స కోసం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన షానవాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన ప్రముఖ న్యాయవాద కుటుంబంలో జన్మించిన షానవాస్‌ విద్యార్థి నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తొలుత కేరళ విద్యార్థి సంఘంలో పనిచేసిన ఆయన.. యూత్‌ కాంగ్రెస్‌లో చేరి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో పలు పదవులు చేపట్టారు.

ఆయనకు భార్య జుబ్బదాత్, కుమార్తె అమీనా, కుమారుడు హసీబ్ ఉన్నారు. ఆయన మృతదేహాన్ని ఈ రోజు మధ్యాహ్నంలోపు చెన్నై నుంచి కొచ్చికి తరలించనున్నారు. గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరాయి విజయన్‌తో పాటు, కేరళ కాంగ్రెస్‌ నాయకులు సంతాపం తెలిపారు.

>
మరిన్ని వార్తలు