సాక్షి, తిరువనంతపురం : దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. గత తొమ్మిది రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో మలయాళ సీమ మరుభూమిని తలపిస్తోంది. ఎప్పుడూ ఏ వైపునుంచి వరద ప్రవాహం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేరళ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు (ఎన్డీఆర్ఎఫ్) ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కేరళ వరదలపై అప్డేట్స్ ఇవి:
This is how the Angamaly Aluva route looks now. This is the point with the maximum amount of water. Big vehicles can go. I had to abandon my taxi, got into an NDRF bus. No, I didn't hamper any rescue, but just took some space and hopped off at Aluva. pic.twitter.com/3pAWudrDRs
— Dhanya Rajendran (@dhanyarajendran) 18 August 2018
కేరళకు రూ. 500 కోట్ల సాయాన్ని ప్రధాని మోదీ తాజాగా ప్రకటించడాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. తాజా సంభవించిన భారీ వరదలతో కేరళ దాదాపు 20వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని, సత్వర సహాయక, పునరావాస చర్యల కోసం తక్షణమే రూ. 2వేల కోట్ల సాయాన్ని అందించాలని కేరళ అడిగితే.. ప్రధాని మోదీ మాత్రం అతి తక్కువ సాయాన్ని అందించారని ఆయన ట్విటర్లో తప్పుబట్టారు.
వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు తక్షణ సాయంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.500 కోట్లు ప్రకటించారు. వరదల బీభత్సంతో రాష్ట్రంలో సుమారు రూ.20వేల కోట్ల నష్టం జరిగిందని, తక్షణమే రెండు వేల కోట్లు సాయం కింద విడుదల చేయాలని కేరళ ప్రభుత్వం ప్రధాని మోదీని విజ్ఞప్తి చేసింది. పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు శనివారం కేరళ వచ్చిన మోదీ, సీఎం పినరయి విజయన్తో సమావేశం అయ్యారు. అనంతరం ఈ నెల 12న కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన రూ.100కోట్లు అదనంగా మరో రూ.500 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని సమీక్షించారు. వరదల్లో మృతి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల నష్టపరిహారం ప్రకటించారు.
కేరళ వరదలను వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ట్విటర్ లో ‘ప్రియమైన ప్రధాని మోదీ గారు.. ఎలాంటి ఆలస్యం చేయకుండా కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. లక్షలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధి, భవిష్యత్ మీ చేతిలో ఉంది’ అని ట్వీట్ చేశారు.