మందుబాబులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

31 Mar, 2020 13:54 IST|Sakshi

తిరువనంతపురం : దేశంలో ఓవైపు కరోనా వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తుంటే.. మరోవైపు మందుబాబు మద్యం కోసం అల్లాడుతున్నారు. మందు దొరక్క మద్యం ప్రియులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, కేరళలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మందు బాబుల ఆర్తనాదాలు విన్న కేరళ ప్రభుత్వం వారికి ఓ గుడ్‌ న్యూస్‌ను అందించింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలకు కేరళ ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే మద్యం కావాల్సిన వాళ్లు వైద్యుడి దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ లెటర్‌ తీసుకు వచ్చిన మారికి మాత్రమే మద్యం విక్రయిస్తామని షరతు విధించింది. (మత్తు లేక మరోలోకం!)

వీలైతే  ఆన్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా చేసేందుకు కేరళ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాలను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మద్యం దొరక్క సోమవారం ఒక్కనాడే కేరళలో తొమ్మిదిమంది మరణించారు. వీరిలో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడగా.. ఇద్దరు గుండెపోటుతో మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అధికారులను సంప్రదించిన సీఎం విజయన్‌ వైద్యుల నుంచి అనుమతి పత్రం పొందిన వారికి మాత్రం మద్యం విక్రయించాలని నిర్ణయించారు.

ఇక తెలంగాణలోనూ మద్యం ప్రియులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో కల్లు లేక నలుగురు మృతిచెందారు. మరోవైపు ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు మద్యం బాధితులు వరుసకట్టారు. కర్ణాకటలోనూ ఆదివారం ఒక్కరోజే ఆరుగురు మందుబాబులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు