‘51 కాదు 17 మంది మాత్రమే’

25 Jan, 2019 14:37 IST|Sakshi

తిరువనంతపురం : సుప్రీం కోర్టు తీర్పుకనుగుణంగా దాదాపు 51 మంది 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారంటూ కేరళ ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నివేదికలో మగవారి పేర్లు రావడం, 50 ఏళ్ల పైబడిన మహిళలర్లు కూడా ఉండటంతో విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కొత్త నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే శబరిమల ఆలయంలోకి ప్రవేశించారని ఈ నివేదికలో తెలిపింది. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందు సమర్పించిన నివేదికలో నలుగురు పురుషులు ఉన్నట్లు గుర్తించాము. వారితో పాటు 30 మంది మహిళలు 50 ఏళ్ల వయసు పైబడిన వారిగా గుర్తించి ఆ పేర్లను నివేదిక నుంచి తొలగించినట్లు’ తెలిపారు.

ఈ క్రమంలో చివరకూ 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే ఆయంలోకి ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 2న బిందు, కనక దుర్గ అనే ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో కేరళలోని హిందూ నిరసనకారులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు.

మరిన్ని వార్తలు